సతీ సహగమనం, శాశ్వత వైధవ్యం, బాల్య వివాహాల పుట్టుక
సతీ సహగమనం, వితంతు పునర్వివాహ నిషేధం, బాల్య వివాహాం-కుల వ్యవస్థ.
కుల వ్యవస్థ ప్రధాన లక్షణం పెళ్ళిళ్ళు అదే కులంలో చేసుకోవడం(Endogamy).కులాంతర వివాహాలు జరిగితే కుల వ్యవస్థ ఉండేదే కాదు.
మరి కులాంతర వివాహాలను ఎలా నిషేధించగలిగారు ?
ఇలా మొదట ఏ గ్రూపు ప్రారంభించింది ?
దీనికి హిందూ మతంలోని దురాచారాలైన సతీ సహగమనం,వితంతు పునర్వివాహ నిషేధం, బాల్య వివాహంలకు సంబంధమేమిటి అనే ప్రశ్నలకు
అంబేద్కర్ 1916 లో (కొలంబియా యూనివర్సిటీ)ఆంత్రోపాలజీ సెమినార్ కి సమర్పించిన
పరిశోధన పత్రం Castes in India,Their mechanism,Genesis and Development మనకు సమాధానాలు లభిస్తాయి.
ఒకే గ్రూపులో ఆడ మగ (యువతీయువకులు) సమానమైన సంఖ్యలో ఉంటేనే గ్రూపు బయట వారితో వివాహం చేసుకునే అవసరం రాదు.కానీ ఇది ప్రాక్టికల్ గా సాధ్యం కాదు.ఎందుకంటే సాధారణంగా
భార్య,భర్తలూ ఒకేసారి చనిపోరు.భర్తలు చనిపోతే అదనపు మహిళలు,భార్యలు చనిపోతే అదనపు మగవారు ఉంటారు.
వీరికి మళ్ళీ అదే గ్రూపులో పెళ్ళి చేయాలి లేకపోతే వేరే గ్రూపు వాళ్ళ అవసరం పడుతుంది.ఇలా వేరే గ్రూపుని ఆశ్రయిస్తే కులానికి అర్థమే ఉండదు.
మరి దీన్ని ఎలా పరిష్కరించాలి ?
అదనపు మహిళలనే తీసుకుంటే
భర్త తో పాటు చితి పేర్చి చంపేయడం(సతీ సహగమనం),ఇలా చేస్తే ఆ మహిళ వేరే గ్రూపు వాళ్ళని పెళ్ళి చేసుకునే అవకాశం ఉండదు,అదే గ్రూపులో ఉన్న వివాహ వయస్సు మహిళలకు పోటీ కూడా ఉండదు.కానీ ఇది క్రూరమైన పని.
బలవంతపు వైధవ్యం(పునర్వివాహ నిషేధం),ఇది ప్రాక్టికల్ గా కొంచెం తేలికైన పరిష్కారం.
ఇక అదనపు మగవారి సంగతి కొస్తే భార్య తో చంపేయడం సాధ్యం కాని పని ఎందుకంటే మగవారు కాబట్టి,అనాదిగా మగవారి ఆధిపత్యం ఉంటుంది కాబట్టి.
మరేం చేయాలి
ఒకటి సన్యాసం పుచ్చుకొని తర్వాతి జీవితం బ్రాహ్మచార్యం పాటించడం
రెండు పెళ్లి వయస్సు వచ్చిన మహిళలు దొరకడం కష్టం కాబట్టి (ఇతర మగవారికి పోటీ అవుతుంది) ఆ వయస్సుకి రాని బాలికలతో వివాహం జరిపించడం.
ఇలా కుల వ్యవస్థ నిలబడడానికి
పితృస్వామ్య వ్యవస్థ లో భాగంగా నాలుగు పరిష్కారాలు
సతీ సహగమనం, శాశ్వత వైధవ్యం, బాల్య వివాహం, సన్యాసం (ఇది మగవారు పాటించడం కష్టం)పుట్టాయని అంబెడ్కర్ తన పరిశోధన పత్రంలో వివరించారు.
ఇందుకు హిందూ పురాణాలలో సతీ సహగమనం గురించి పొగడ్తలు చూడొచ్చు.
భర్తే దైవం,భార్య భర్త వేరు కాదు కాటికి కూడా కలిసే పోవడాన్ని కీర్తించడం.
వైధవ్యంలో తెల్ల చీర,అలంకరణలేకపోవడం(పురుషులను ఆకర్షించకుండ),బయటకు రాకుండా ఆంక్షలు(విధవ ఎదురొస్తే అనర్ధాలు,విధవ ఎటువంటి శుభకార్యాలలో పాల్గొనకుండా నిషేధించడం)
పేరంటాళ్ళు,శుభకార్యాలు, అశుభం,అపవిత్రత,బొట్టు గాజులకి పవిత్రత అపాదించడం లాంటివి దీనికి సంబంధించినవే
బాల్య వివాహానికి పవిత్రత ఎలా ఆపాదించారంటే మహిళకు పెళ్లి కి ముందు తన భవిష్యత్ భర్త కాకుండా వేరే మగవారి మీద ఎటువంటి ఆకర్షణ కలుగకూడదు.భర్త ఎవరో ముందే తెలియదు కాబట్టి తనకి లైంగిక పరమైన ఆలోచనలు రాకముందే పెళ్లి చేస్తే పరాయి వాళ్ళ మీద ఆకర్షణ సమస్యనే ఉండదు.
మరి ఈ ఎండోగామీని ముందుగా ప్రారంభించిందెవరు ?
బ్రాహ్మణ వర్ణం వారు తమ సామాజిక స్థాయిని నిలుపుకోవడానికి మొదట పాటించడం ప్రారంభించారు.కారణం సమాజంలో అత్యున్నత స్థానంలో ఉన్నవారికే పైకెదగడానికి ఏమీ ఉండదు,వారికే మిగతా వారు తమ స్థాయికి రాకుండా అడ్డుకోవాల్సిన అవసరం ఉంటుంది అలా ముందు బ్రాహ్మణ వర్ణం వారు కులాన్ని ప్రారంభించారు దీనికి పర్యావసానమే బ్రాహ్మణేతర వర్గం ఏర్పడింది.తర్వాత స్థాయిలో ఉన్న క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని కాల క్రమేణా అనుకరించడంతో కుల వ్యవస్థ పూర్తిగా స్థిరపడి బలపడింది.
మొదట్లో కొన్ని సడలింపులు ఉన్నాయి సహజంగానే పితృస్వామ్య వ్యవస్థ కాబట్టి
ఉదాహరణకు అనులోమ వివాహాలు ( అగ్ర కులం మగవారు కింది కులాల మహిళలను వివాహం చేసుకోవడం లేదా లైంగిక సంబంధాలు పెట్టుకోవడం )అనుమతించే వారు కానీ ప్రతిలోమ వివాహాలు( కింది కులాల మగవారు పైకులాల మహిళలను వివాహం/లైంగిక సంబంధాలు ).ఒక వేళ ఇలా జరిగినా పుట్టిన సంతానానికి వర్ణ సంకరంగా భావించి వెలి వేశేవారు.ఇలా కొన్ని కొత్త కులాలు పుట్టినట్లు మనకు కులవ్యవస్థ చరిత్రలో అర్థమవుతుంది.
దురాచారాలైన సతీసహగమనం,శాశ్వత వైధవ్యం, బాల్య వివాహాలు పాటింపు కూడా బ్రాహ్మణులలో ఎక్కువ ఉండేది తర్వాత సామాజిక స్థాయి ని బట్టి ఈ అనుకరణ మారుతూ వచ్చింది. అంటే సామాజిక స్థాయి తగ్గేకొందీ ఈ దురాచారాల అనుకరణ తగ్గుతుందనమాట.శూద్ర కులాల్లో ఈ దురాచారాలు చాలా తక్కువ పాటించారు.
మొత్తానికి పితృస్వామ్య వ్యవస్థ, కుల వ్యవస్థ కలిసి బ్రాహ్మణ కుల మగవారికి తప్ప మిగతా సమాజంలో అందరికీ సమాన హక్కులు లేకుండా చేశాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి